ఏపీలో బైక్‌లు నడిపేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై అలా కుదరదు, హైకోర్టు సీరియస్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోడ్డు ప్రమాదాలపై దాఖలైన పిల్‌పై విచారణ జరిగింది. రాష్ట్రంలో హెల్మెట్‌ ధరించని వాహనదారులపై ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. 99 శాతం మంది హెల్మెట్‌ ధరించకుండా బైక్‌లు నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని తెలిపింది. విజయవాడలో హెల్మెట్‌ ధరించిన వారు కనిపించడం లేదని.. హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి చేయాలని తామిచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. అంతేకాదు చట్ట నిబంధనలు అమలు చేయడంలో ట్రాఫిక్‌ పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. హెల్మెట్‌ ధరించనివారికి వారు జరిమానా విధిస్తున్నట్లు తాము ఎక్కడా గమనించలేదన్నారు.

2023 ఆగస్టు నాటికి 69,161 చలానాలు విధించామని ప్రభుత్వం తరఫున ఎస్‌జీపీ ఎస్‌ప్రణతి తెలిపారు. చలానాలు చెల్లించకుంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేస్తున్నామని చెప్పారు. సీసీ టీవీల ఏర్పాటుతోపాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. గతంలో తాము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎంత మంది ప్రమాదాల్లో చనిపోయారు, ఇప్పటి వరకు ఎన్ని చలానాలు విధించారు, ఎన్ని లైసెన్సులు రద్దు చేశారో వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అన్ని వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయిల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

రాష్ట్రంలో కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని లాయర్ యోగేష్‌ హైకోర్టును ఆశ్రయించారు. 2022లో బైక్‌ ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో 3,703 మంది చనిపోగా.. హెల్మెట్‌ ధరించని కారణంగా అందులో 3,042 మంది చనిపోయారని లెక్కలతో సహా ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఇటీవల ఈ పిల్‌‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయిల ధర్మాసనం.. హెల్మెట్‌ ధారణ నిబంధనను తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. మరి ప్రభుత్వ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *