ఆంధ్రప్రదేశ్లోని విలీన మండలాల సమీపంలో రైలు కూత వినిపించబోతోంది. గోదావరికి అవతలి వైపు కొత్త రైలు మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీకి కలిసొస్తుంది. కేంద్రం ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి తెలంగాణలోని బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు 200.60 కి.మీ. పొడవుతో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ఓకే చెప్పింది. మొత్తం రూ.4,109 కోట్ల వ్యయంతో ఈ లైను నిర్మాణం కాబోతోంది.. ఒడిశా నుంచి ఈ లైను గోదావరి అవతలి వైపున ఉన్న చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా వస్తుంది.. అక్కడి నుంచి భద్రాచలం చేరి అక్కడ నుంచి బూర్గంపాడు మండలం పాండురంగాపురానికి వస్తుంది.
విలీన మండలాల్లో కుక్కునూరు మండలంలోని పలు గ్రామాలు గోదావరి నదిని దాటితే చాలు కొత్తగా రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. కుక్కునూరు మండలంలో మిర్చిసాగు ఎక్కువగా ఉంటుంది.. ఇక్కడ వేలాది ఎకరాల్లో సాగయ్యే మిర్చి పంటను ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ మార్కెట్కు తీసుకెళతారు. కాబట్టి ఈ రైలు మార్గంతో రైతులంతా పంటను అమ్ముకోవటానికి ఈ రైలు మార్గంతో మరింత సులభం అవుతుంది. రైతులు ఏడాదికి రెండు, మూడుసార్లు జగదల్పూర్ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఒడిశా నుంచి మిరప పంట కోతలకు వేల సంఖ్యలో కూలీలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వస్తుంటారు. ఈ రైలు మార్గం పూర్తైతే కూలీలకు వ్యయ ప్రయాసలు తప్పుతాయి అంటున్నారు.
మరోవైపు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి మార్గానికి సంబంధించి.. 173.61 కి.మీల మార్గం కోసం రూ.3,591.76 కోట్లు మంజూరు చేశారు. కొత్త రైలు మార్గంలో భాగంగా సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ.3,061.91 కోట్లు, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్కి రూ.342.15 కోట్లు, ఎలక్ట్రికల్ (జనరల్)కు రూ.50.97 కోట్లు, సిగ్నల్, టెలి కమ్యూనికేషన్స్కు రూ.136.73 కోట్లు కేటాయించారు. ఈ రైలు మార్గం కోసం భద్రాచలం దగ్గర గోదావరిపై రోడ్డు మార్గంలో రెండు వంతెనలు ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో రైలు రాకపోకలకు మరో వంతెనను నిర్మించబోతున్నారు. భద్రాచలం- సారపాక మధ్యలో గోదావరిపై 2 కి.మీ. పొడవైన వంతెన నిర్మించనున్నారు. సారపాకలోని ఐటీసీ ఫ్యాక్టరీకి ఇబ్బంది లేకుండా దాని వెనుక నుంచి ఈదారి ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఈ రైలు మార్గం రూ.4,109 కోట్లతో ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు 200.60 కిలోమీటర్ల పొడవైన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనుంది. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఏర్పడుతుందని చెబుతున్నారు అధికారులు.