ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును మరో రెండు రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్ మార్చాలని ప్రభుత్వానికి పలువురు విఙప్తి చేశారు. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసి, దరఖాస్తుల గడువును అక్టోబరు 11 వరకు పెంచింది. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు.
అక్టోబరు 12, 13 తేదీల్లో దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ నెల 14వ తేదీన కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపులకు లాటరీ తీయనున్నట్టు ఆయన చెప్పారు. అదే రోజున లైసెన్స్లు మంజూరు చేస్తామని, 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుందని ఆయన వివరించారు. మద్యం దుకాణాలకు పోటాపోటీగా దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. ఇప్పటి వరకు 52 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి రూ.1000 కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు.
Amaravati News Navyandhra First Digital News Portal