తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్కు వినియోగించిన ఖాళి టిన్లను టీటీడీ వేలం వేస్తోంది. ఆసక్తి ఉన్నవారు సీల్డ్ టెండర్లను టీటీడీ ఆహ్వానించింది.. టెండర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్లు 2025 మార్చి 31వ తేదీ వరకు సేకరించేందుకు అవకాశం ఉంటుంది. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండర్లు అక్టోబరు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించాలంటోంది టీటీడీ.
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి రోజు (అక్టోబరు 31) దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనుంది టీటీడీ. దీపావళి రోజు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు.. ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 31న దీపావళి ఆస్థానం కారణంగా.. ఆ రోజు తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారు.
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఈ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా నవంబరు 4, 11, 18, 25వ తేదీలలో తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించనున్నారు.
డిసెంబరు 1న మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు చండీకేశ్వరస్వామికి అభిషేకం, త్రిశూల స్నానం జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు లక్షదీపారాధన, పంచమూర్తులైన శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహించనున్నారు. ఆ తరువాత పంచమూర్తులను పురవీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు. ఈ మాసంలో కపిలేశ్వర స్వామివారిని ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో అర్చించినట్లయితే శివస్థానాన్ని పొందుతారని పురాణ ప్రశస్తి. పవిత్ర కార్తీక మాసంలో పుణ్యస్నానం, పుణ్యయోగుల దర్శనం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని అర్చకులు తెలిపారు.