దేశంలోని విమానయాన సంస్థలకు ఈ మధ్య ఓ కొత్త తలనొప్పి మొదలైంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి వస్తున్న బెదిరింపు కాల్స్. మెయిల్స్ విమానయాన సంస్థలను బెదరగొడుతున్నాయి. విమానం ప్రయాణిస్తున్న సమయంలో.. లేదా ప్రారంభానికి ముందు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉండటంతో.. పలు విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. మరికొన్నింటిని హుటాహుటిన దారిమళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేసి పరిశీలించాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకూ వచ్చినవి అన్నీ ఫేక్ కాల్స్ కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు కాల్స్ కారణంగా భారీగా నష్టం కూడా జరుగుతోంది. దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖ నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. విమానాలకే కాకుండా హోటల్స్, రెస్టారెంట్లకు సైతం ఇలాంటి కాల్స్ వస్తున్నాయి.
అయితే ఈ బెదిరింపు కాల్స్ వెనుక ఉన్న అజ్ఞాత శక్తులెవరో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పోలీసులు ఓ విషయం గుర్తించారు. ఈ బాంబు బెదిరింపులకు సంబంధం ఉన్న ఓ వ్యక్తిని గుర్తించారు. మహారాష్ట్ర విదర్భ రీజన్లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన గోండియా జిల్లాకు చెందిన జగదీష్ ఉయికేకు వీటితో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 35 ఏళ్ల జగదీష్ ఈ బెదిరింపు కాల్స్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ జగదీష్ ఉయికే గతంలో ఉగ్రవాదంపై ఓ పుస్తకం కూడా రాశాడు. ఉగ్రవాదంపై పుస్తకం రాసిన ఈ జగదీషే.. బెదిరింపు కాల్స్ వెనుక ఉన్న సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.