నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (RGUKT) ట్రిపుల్ఐటీ క్యాంపస్లో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతన్న స్వాతిప్రియ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకోవటం కలకలం రేపిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని స్వాతిప్రియ ప్రాణాలు కోల్పోయింది. స్వాతిప్రియ స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలిక పరిధిలోని పెర్కిట్ గ్రామం. ఉజ్వల-రవీందర్ దంపతులకు స్వాతిప్రియ(18) రెండో సంతానం. సోమవారం ఉదయం తోటి స్నేహితులు టిఫిన్ చేయడానికి పిలవగా ఆమె రానని చెప్పింది. ఆ తర్వాత అర గంటకు గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. గమనించిన తోటి విద్యార్థులు ఆర్జీయూకేటీ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
అయితే స్వాతిప్రియ గదిలో సూసైడ్ లెటర్ దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఆ లెటర్లోని కొన్ని పేజీలు బయటకు వచ్చాయి. మెుత్తం 6 పేజీల సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కానీ అందులోని కొన్ని పేజీలను బయటకు లీక్ చేసినట్లు తెలిసింది. సూసైడ్ లెటర్లో తన కుటుంబం, విద్యార్థులు, కాలేజీ గురించి స్వాతిప్రియ ప్రస్తావించినట్లు వెల్లడైంది. సూసైడ్ లెటర్లో స్వాతిప్రియ ప్రస్తావించిన అంశాలు కన్నీరు పెట్టించే విధంగా ఉన్నాయి. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉందని.. అయినా తాను ఇక బతకలేనని చెప్పింది. తన అంత్యక్రియలకు స్నేహితులందరూ రావాలని కోరింది.
‘అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. సూసైడ్ చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది. ధైర్యం సరిపోవటం లేదు. అయినా తప్పట్లేదు.. ఐ మిస్ యూ సో మచ్. అక్క, తమ్ముడిని బాగా చూసుకోండి. అక్క, తమ్ముడు.. మీకేం కష్టం వచ్చినా డాడీకి చెప్పండి. నాన్న మీరు ఇకనైనా స్మోకింగ్ చేయటం మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి. మన బంధువులందరూ విభేదాలను పక్కకు పెట్టి నా అంత్యక్రియల్లో పాల్గొనాలి.’ అంటూ స్వాతి ఆ సూసైడ్ లేఖలో పేర్కొంది.