ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి ప్రభుత్వం తీపికబుర్లు చెప్పింది. ఈ నెల ఒక రోజు ముందే పింఛన్ పంపిణీ చేస్తోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో.. ఒకరోజు ముందుగా నవంబర్ 30న పింఛన్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు ప్రతి నెలా కొందరు పింఛన్ తీసుకోలేకపోతున్నారు.. అందుకే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మూడు నెలలకోసారి పింఛన్ తీసుకునేలా మరో వెసులుబాటు కల్పించింది.. అంటే రెండు నెలలు వరుసగా తీసుకోకపోతే, మూడో నెలలో కలిపి ఒకేసారి (రూ.12వేలు) డబ్బుల్ని తీసుకోవచ్చు. అంతేకాదు ఒకవేళ పింఛన్ తీసుకునే లబ్ధిదారుడు చనిపోతే.. ఆ మరుసటి నెల నుంచే ఆయన భార్యకు వితంతువు పింఛన్ అందిస్తారు.
గతంలో కూడా సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో.. ఆగస్టు 31నే పింఛన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. డిసెంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీనే పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 28న లబ్ధిదారుల సంఖ్య మేరకు ప్రభుత్వం.. పింఛన్ డబ్బుల్ని బ్యాంకు అకౌంట్లో జమ చేయనుంది. ఈ నెల 29న ఆ డబ్బుల్ని సచివాలయ సిబ్బంది విత్ డ్రా చేసి.. 30న లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అర్హత ఉంటే చాలు.. ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు కొత్తగా పింఛన్ దరఖాస్తు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఉంది. జనవరి నుంచి కొత్త పింఛన్లను ప్రభుత్వం అందజేయాలని భావిస్తోంది. అంతేకాదు అనర్హుల్ని కూడా గుర్తించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం.