ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1535 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఇక జనరల్ పరీక్షలు మార్చి 15వ తేదీతో ముగియనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు నేటితో (ఫిబ్రవరి 20వ తేదీతో) ముగుస్తాయి. ఈ ఏడాదికి ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
మొత్తం విద్యార్ధుల్లో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. మొత్తం విద్యార్ధుల్లో జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఇక ఇంటర్ పరీక్షలకు ఈ రోజు నుంచి హాల్టికెట్లు పంపిణీకి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గత ఏడాది అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల ట్యాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు గతేడాది మాదిరిగానే క్యూఆర్ కోడ్ విధానం అనుసరిస్తారు. దీని ద్వారా ఎక్కడైనా ప్రశ్నపత్రం బయటకు వస్తే.. అది ఎక్కడ నుంచి వచ్చింది అనేది విషయం సెంటర్తో సహా సమస్త వివరాలు వెంటనే తెలిసిపోతాయి. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయనుంది.