అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేజీ టూ పీజీ కరికులంలో ఇకపై మార్పులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఉందని అన్నారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ – టీచర్స్ డేను ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్య బంధం బలపడుతుంది. ఒక వ్యవస్థ బాగుపడాలంటే.. అందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలి. విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉండాలంటే సమాజ భాగస్వామ్యం తప్పనిసరి. బడి భవిష్యత్తు కోసం చదివే పిల్లలు-వారి తల్లిదండ్రులు, చదువు చెప్పే ఉపాధ్యాయులు-గైడ్ చేసే హెడ్మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీలు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇదే లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం రాష్ట్రమంతా నేడు ఒకేరోజున పండగ వాతావరణంలో జరిగిందని ఐటీ మంత్రి లోకేష్ అన్నారు.
పేరెంట్-టీచర్ మీటింగులు అన్ని చోట్లా జరుగుతాయి. కానీ మన పేరెంట్-టీచర్ మీటింగ్ ఒక రికార్డు. రాష్ట్రమంతా ఒకేసారి వేలాది స్కూళ్లలో, లక్షలాది విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు సమావేశం కావడం ఒక చరిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా 45094 ప్రభుత్వ, మరియు ఎయిడెడ్ పాఠశాలలలో ఒకేసారి నిర్వహించారు. ఇందులో 35 లక్షల మంది విద్యార్థులు, 71 లక్షల తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50 వేలకు పైగా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశాలతో బడితో తల్లితండ్రులకు ఆత్మీయ బంధంఏర్పడుతుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మరింత భరోసా ఇస్తుంది.