దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్ మాత్రం అప్పుడే..చంద్రబాబు ఆదేశాలు

chandrababu free gas cylinder scheme: ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుపై సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో చంద్రబాబు సమీక్షించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై వారితో చర్చించారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు.. మహిళల కోసం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని చంద్రబాబు అన్నారు.

ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకం అమలులో వెనక్కి తగ్గమన్నారు చంద్రబాబు. అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం జరుగుతుందని చెప్పారు. ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి, అర్హత గల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ప్రతి 4 నెలల వ్యవధిలో ఎప్పుడైనా లబ్ధిదారులు.. ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమవుతున్నప్పటికీ.. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం అక్టోబర్ 24 నుంచే బుకింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అక్టోబర్ 31 నుంచి సిలిండర్ల పంపిణీ మొదలు కానుంది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు.. 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరోవైపు మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతోనే అప్పట్లో దీపం పథకం తెచ్చామన్న చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు చెప్పారు. వంట గ్యాస్ కోసం అయ్యే ఖర్చును ఇతర అవసరాలకు వాడుకోవచ్చన్నారు. అర్హత గల ఏ ఒక్కరికీ ఈ పథకం రాలేదనే విమర్శ రాకుండా అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఈ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.876లుగా ఉందన్న అధికారులు.. కేంద్రం ప్రతి సిలిండర్‌కు రూ.25 సబ్సిడీ ఇస్తోందన్నారు. దీంతో సిలిండర్ ధర రూ.851లుగా ఉందని వివరించారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం ద్వారా ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. మొత్తంగా ఐదేళ్లకు కలిపి రూ.13వేల 423 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *