భారతదేశం తీరం వెంబడి అనేక అందమైన బీచ్లు ఉన్నాయి. గోవా, కేరళ, అండమాన్ సముద్రతీరంలో వైట్ సాండ్ బీచ్లు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. అదే తరహాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానం లో వైట్ సాండ్ బీచ్ ఉందన్న విషయం ఎంత మందికి తెలుసు? అత్యంత సుందరంగా తెల్లటి ఇసుకతో ఆహ్లాదాన్ని నింపుతుంది. అమలాపురానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం లో సముద్రతీరం బీచ్ ప్రశాంతంగా ఎంతో ఆనందాన్నిస్తుంది . సాయంత్రం వేళ సాగర తీరాన కూర్చొని సేదతీరడం, అందమైన సూర్యాస్తమయాన్ని వీక్షించడం, ఆత్మీయులతో కబుర్లు చెప్పుకోవడం, నోరూరించే సీఫుడ్ రుచి చూడటం ఒకటేమిటి ఇలాంటి అనేక రకాల ఆహ్లాదాన్ని బీచ్ మనకు అందిస్తుంది, మరపురాని క్షణాలను మన మదిలో నిలిపి ఉంచుతుంది.
ఇప్పుడీ బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతోంది కూటమి ప్రభుత్వం. ఇతర దేశాలలో మాదిరిగా వెలుగులోకి తీసుకువస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు కోనసీమ టూరిజం హబ్ గా ఏర్పడేందుకు వీలుంటుందని చెబుతున్నారు స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. బీచ్ ను ప్రమోట్ చేసేందుకు ఇండియా బీచ్ ఉమెన్స్ వాలీబాల్ పోటీలు సంక్రాంతికి బీచ్ ఫెస్టివల్ లో భాగంగా నిర్వహించబోతున్నారు కూడా.