ఏపీ రాజకీయాల్లో ఘాటు పెంచిన మిర్చి ఎపిసోడ్లో శుభం కార్డు పడింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఇక తెరపడినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మద్దతు ధర ఇస్తామంది.
ఏపీ రాజకీయాలను గత కొన్ని రోజుల పాటు మిర్చి పంట కుదిపేసింది. వైసీపీ అధినేత జగన్ ..గుంటూరు మిర్చి యార్డ్కు వెళ్లి అక్కడి సమస్యలపై మాట్లాడారు. ఇక అప్పటి నుంచి రాజకీయాల్లో మిర్చి ఘాటెక్కింది. మిర్చి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షం.. అండగా ఉంటామని అధికార పక్షం నేతలు మాటల తూటాలు పేల్చుకున్నారు. దీంతో చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖతో కదిలిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్ ఇంటర్వెన్షల్ స్కీమ్ కింద క్వింటా మిర్చికి 11 వేల 781 రూపాయల మద్దతు ధర ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఏపీ నుంచి 2 లక్షల 58 వేల మెట్రిక్ టన్నుల మిర్చిని సేకరిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం పట్ల మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని మిర్చి రైతులు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇటీవల వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించారు. అక్కడున్న మిర్చి రైతులను పరామర్శించారు. మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. మిర్చి రైతులను ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు లేఖ రాశారు చంద్రబాబు. ఇక్కడి రైతులు పండించిన మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు చంద్రబాబు. అలాగే మిర్చి రైతుల సమస్యపై కేంద్రంతో చర్చించి, వారికి మేలు జరిగేలా చూడాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను చంద్రబాబు ఆదేశించారు. శనివారం సచివాలయంలో మిర్చి రైతుల సమస్యపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు సీఎం చంద్రబాబు. తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ .. కేంద్రం దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించడంతో మిర్చి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.