Revanth Reddy 3 Days Delhi Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈసారి ఒంటరిగా కాకుండా.. కుటుంబ సమేతంగా హస్తినకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. మొదట ఢిల్లీకి వెళ్లి.. అటు నుంచి రాజస్థాన్లోని జైపూర్కు వెళ్లనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడే ఉండనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపారు. కాగా.. ఈరోజు (డిసెంబర్ 10న) సాయంత్రమే శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. అక్కడి నుంచి జైపూర్కు వెళ్లనున్నారు. జైపూర్లో తమ బంధువుల వివాహ వేడుక ఉండగా.. దానికి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. జైపూర్లో వివాహ కార్యక్రమానంతరం.. రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి చేరుకోనున్నట్టు తెలుస్తోంది.
ఓవైపు.. బంధువుల పెళ్లికి హాజరవటమే కాకుండా.. మరోవైపు రాజకీయ వ్యవహారాల్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్లు కూడా తీసుకున్నట్టు సమాచారం. వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆయా శాఖల నుంచి గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రులను కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.