ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం చోటుచేసుకుంది.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ అధినేత కేజ్రీవాల్పై 1200 పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్సింగ్ చేతిలో మాజీ డిప్యూటీ సీఎం సిసోదియా ఓటమి పాలయ్యారు. మరో పార్టీ కీలక నేత.. సత్యేందర్ జైన్ సైతం.. షాకుర్ బస్తీ స్థానంలో ఓడిపోయారు. ఓటమివైపు సాగుతోన్న పార్టీకి అగ్ర నేతల పరాజయం మరింత కుదుపుగా చెప్పాలి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించినట్లే. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. మధ్యతరగతి ప్రజల చూపు కాషాయం వైపుగా ఉన్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ ఏయే అంశాలు కలిసొచ్చాయన్నది కీలకంగా మారింది.కేంద్ర బడ్జెట్లో పన్ను మినహాయింపుల మోత మోగించిన కాషాయానికి ప్రజలు జై కొట్టారు. బీజేపీకి ఎన్నికల హామీలు కలిసివచ్చాయి. ఆమ్ఆద్మీ మీద ప్రజల వ్యతిరేకత కూడా కాషాయానికి అనుకూలంగా మారింది. ఈ పరిణామాలతో మూడుసార్లు అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీకి ప్రజలు ఉద్వాసన పలికారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్స్కామ్, శీష్మహల్ వివాదం, అవినీతి, యమునా కాలుష్యం వివాదం కీలకంగా మారాయి. కేజ్రీవాల్ మానసపుత్రికలైన మొహల్లా హాస్పిటల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రజలు మొగ్గు చూపలేదు.
అంతేగాక, ఢిల్లీలో ఆమ్ఆద్మీపై బీజేపీ దూకుడుగా ప్రచారం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాల అనైక్యత కూడా బీజేపీకి కలిసివచ్చింది. ఇండియా కూటమి ఓట్ల చీలికతో బీజేపీ లాభపడింది. ఆమ్ఆద్మీకి, కాంగ్రెస్కి కలిపి 50శాతం వరకు ఓట్ షేరింగ్ వచ్చాయి. కానీ విడివిడిగా పోటీపడటంతో ఆమ్ఆద్మీ ఓడిపోయింది. బీజేపీ కంటే ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చినా విడిగా పోటీచేయడం వల్ల ఫలితం మారింది.