గుంటూరు జిల్లా GGHకు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఐదుగురు బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరిని డిశ్చార్జ్ చేశామని చెబుతున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోందంటున్నారు
ఏపీలో గులియన్-బారే సిండ్రోమ్ బారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతుంది. నాలుగు రోజుల్లో ఏడుగురు బాధితులు గుంటూరు జిజిహెచ్కు చికిత్స కోసం వచ్చారు. వీరిలో ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు వెంటిలేటర్పై ఉండగా మరొకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న వారిని వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు పరామర్శించారు. ప్రభుత్వ సంసిద్ధత, మందుల లభ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై వైద్యులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ స్థాయిలోనే జిబిఎస్ కేసులు నమోదు అవుతున్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిబిఎస్ చికిత్సలో భాగంగా ఇమ్యూనో గ్లోబిన్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచామన్నారు.
జిబిఎస్ లక్షణాలు
కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం, నరాల బలహీనత, గొంతు పొడిబారి పోవడం, ఆహారం తీసుకోలేకపోవటం వంటి లక్షణాలతో జిజిహెచ్కు వస్తున్నట్లు సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వచ్చిన వారికి ఇమ్యూనో గ్లోబిన్ ఇంజెక్షన్ ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకూ జిజిహెచ్లో ఎటువంటి మరణాలు లేవన్నారు.
అసాధారణ పరిస్థితులు లేవు…. కృష్ణ బాబు
జిబిఎస్ కొత్తగా వస్తున్న వ్యాధి కాదని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు తెలిపారు. ప్రతి లక్ష మందిలో ఒకరో ఇద్దరో ఈ వ్యాధి బారిన పడతారన్నారు. జిజిహెచ్కి ప్రతి నెల పది పదిహేను కేసులు వస్తుంటాయన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా ఇన్ఫెక్షన్ బారినపడిన తర్వాత జిబిఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నామన్నారు. ఒక ప్రాంతానికో, ఒక ప్రత్యేక కారణంగానో ఈ వ్యాధి వస్తున్నట్లు ఇప్పటివరకూ రుజువు కాలేదన్నారు. శానిటేషన్ మెయింటెయిన్ చేసుకోవడంతో పాటు వ్యక్తిగతమైన శుభ్రత పాటించడం, రోగ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం చేయాలన్నారు.