ఏపీలో ఇద్దరు ఐఏఎస్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐఏఎస్ శిక్షణలో ఇద్దరికీ పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిసి ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల్ని ఒప్పించి మరీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట పెళ్లిని ఇరు కుటుంబాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుడి స్వగ్రామం ఈ పెళ్లి వేడుకకు వేదిక అయ్యింది.. సందడి వాతావరణం కనిపించింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రుకు చెందిన తరెట్ల ధర్మారావు ఐఏఎస్ అధికారి.. మధ్యప్రదేశ్లో కమిషనర్ స్థాయి వరకు బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. ధర్మారావు కుటుంబం కూడా మధ్యప్రదేశ్లో స్థిరపడగా.. ఆయన కుమారుడు తరెట్ల ప్రతీక్రావు కూడా తండ్రిలా ఐఏఎస్ అయ్యారు. అయితే ఐఏఎస్ కోసం శిక్షణలో భాగంగా ఢిల్లీ వెళ్లిన సమయంలో.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆర్కే శ్రీవాత్సవ్, చిత్రాంజలి దంపతుల కుమారై అనీషాతో 2023లో ఢిల్లీలో పరిచయం ఏర్పడింది.. ప్రేమగా మారింది. అయితే ఆర్కే శ్రీవాత్సవ్ కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది.
వీరిద్దరు ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఇద్దరూ మధ్యప్రదేశ్లోనే ఉద్యోగంలో చేరారు. ప్రసుత్తం ప్రతీక్రావు ఇటార్సిలో, అనీషా పిపారియాలో జాయింట్ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ జంట తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మనసులో మాట చెప్పారు. ఇద్దరి తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోవడంతో.. ఈ నెల 17న విశాఖపట్నంలో ఘనంగా వివాహం జరిగింది. మంగళారం సొంత ఊరు బిళ్లకుర్రు శివారు తరెట్లవారిపేటలో విందు ఏర్పాటు చేశారు. వధూవరులు ఇద్దరు ఐఏఎస్లు కావడంతో గ్రామంలో సందడి వాతావరణం కనిపించింది. గ్రామస్థులంతా నూతన వధూవరులను సత్కరించారు. మొత్తానికి ఇద్దరు ఐఏఎస్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతంలో కూడా ఐఏఎస్లు పలువురు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. వాస్తవానికి ఐఏఎస్ ప్రతీక్రావు కుటుంబం మధ్యప్రదేశ్లో స్థిరపడినా సరే సొంత ఊరిపై ప్రేమతో ఇక్కడికి వచ్చారు. విశాఖపట్నంలో ఘనంగా వివాహ వేడుక నిర్వహించగా.. సొంత ఊరిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన వారు ఆనందంలో ఉన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal