ప్రపంచ ప్రముఖ సంగీత దర్శకుడు, మూడుసార్లు గ్రామీ విజేత రిక్కీ కేజ్ (Ricky Kej).. స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని అద్భుతమైన వీడియోను రూపొందించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా సహా సంగీత దిగ్గజాల సహకారంతో భారత జాతీయగీతం జనగణమనను (National Anthem) వైవిధ్యభరితంగా ఆలపించారు. బ్రిటిష్ ఆర్కెస్ట్రా, 14వేల మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీతాలాపన.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను రిక్కీ కేజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, రాకేశ్ చౌరాసియా, రాహుల్ శర్మ, అమన్, అయాన్ అలి బంగాశ్, జయంతి కుమరేశ్, షేక్ మహబూమ్, కలీషాబీ మహబూబ్ విద్యాంసులు తమ వాయిద్యాలతో జాతీయ గీతాన్ని ప్రత్యేకంగా పలికించారు. వీరితో పాటు బ్రిటన్ రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాకు చెందిన 100 మంది సభ్యుల బృందం కూడా ఆలాపనలో పాల్గొనడం మరో విశేషం.
ప్రముఖ విద్యావేత్త డాకట్ర్ అచ్యుత సమంత సహకారంతో ఒడిశాలోని కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కు చెందిన 14 వేల మంది అదివాసీ చిన్నారులతో జాతీయ గీతాలపన చేయించారు. ఆ చిన్నారులు భారత్ చిత్రపటం ఆకారంలో ‘భారత్’ ఆంగ్ల, హిందీ అక్షరక్రమంలో నిలబడి జాతీయగీతాన్ని (National Anthem) ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై రిక్కీ కేజ్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు నేను విన్న తొలి సంగీతం మన జాతీయగీతమే.. అత్యుత్తమ శాస్త్రీయ సంగీతకారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి ఇలా జాతీయగీతాన్ని ఆలపించడం చాలా అద్భుతంగా ఉంది’’ అని ఆనందం వ్యక్తంచేశారు.
వీఆర్ ఫిల్మ్మేకర్ సాయిరామ్ సాగిరాజు, కొంతమంది డెవలపర్లతో కలిసి రిక్కీ వర్చువల్ రియాల్టీ వెర్షన్ ప్రాజెక్ట్ను రూపొందించారు. గతంలోనూ ఇలాంటి వైవిధ్యభరిత ప్రదర్శనలు ఇచ్చిన రికీ… గతేడాది లండన్లోని అబే రోడ్ స్టూడియోస్ వద్ద అతిపెద్ద సింఫనీ ఆర్కెస్ట్రాతో జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజు 2023 ఆగస్టు 14న ఈ వీడియోను విడుదల చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal