ఐటీ ఉద్యోగుల్లో కొంత కాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. చాలా వరకు.. లేఆఫ్స్ ప్రభావం తమపై ఉంటుందని కంగారుగా ఉన్నారు. కారణం.. ఏడాది వ్యవధిలో దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వరుసగా తగ్గుతుండటమే. అతిపెద్ద భారత ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని కంపెనీల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో భారీగా ఉద్యోగులు తగ్గిపోయారు. ఇదే సమయంలోనే అసలు నియామకాల ఊసే లేదు. దీంతో ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందారు. ఇప్పటి సంగతి పక్కనబెడితే.. దిగ్గజ ఐటీ సంస్థలు.. గతంలో ఆఫర్ లెటర్స్ ఇచ్చిన ఉద్యోగుల్ని కూడా ఆఫీసులకు పిలవకుండా జాప్యం చేసినట్లు తెలిసింది.
ఇక దీనిపై నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES).. కేంద్ర కార్మిక శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఉద్యోగులకు అన్యాయం చేయొద్దని.. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన అందరినీ తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తర్వాత ఐటీ కంపెనీలు కీలక ప్రకటనలు చేశాయి. ఇటీవల.. గతంలో తాము ఆఫర్ లెటర్స్ ఇచ్చిన అందరు ఫ్రెషర్స్కు ఉద్యోగాలు పక్కాగా ఉంటాయని.. తేదీలే అటూ ఇటు మారతాయని చెప్పారు.
దీని తర్వాత కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ మళ్లీ.. 1500 మందిలో మొత్తంగా ప్రీ ట్రైనింగ్ కోసం దాదాపు 115 మందినే ఎంపిక చేసిందని.. మిగతా వారిని పిలవలేదని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇన్ఫీ మరో కీలక ప్రకటన చేసింది. రెండు సంవత్సరాల కిందట.. కళాశాల ప్రాంగణాల్లో ఎంపిక చేసిన ఇంజినీరింగ్ పట్టభద్రులకు నియామకాలు ఇవ్వడం తాజాగా ప్రారంభించింది.
ఇప్పటికే చాలా మంది ఫ్రెషర్లకు జాయినింగ్ డేట్స్, ఆఫర్కు సంబంధించిన సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. క్యాంపస్ నియామకాల్లో ఎంపికైన దాదాపు 1000 మందికి ఇప్పటికే ఆఫర్ లెటర్స్ కంపెనీ అందించిందని నైట్స్ తెలిపింది. ఇక ఈ నియామకాలు సెప్టెంబర్ ఆఖర్లో లేదా అక్టోబరులో ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు.. విప్రో గతంలో ఆఫర్ లెటర్స్ ఇవ్వగా వాటిని 30 నెలల తర్వాత రద్దు చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. గతంలో ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికే తాజాగా నెక్ట్స్ జెన్ అసోసియేట్స్ కోసం ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది.