Revanth Reddy Defamation Case: సీఎం రేవంత్ రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కోర్టు నోటీసులకు కారణమయ్యాయి. అయితే.. హైకోర్టు ఎంట్రీతోనే.. సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను వచ్చే నెల 25వ తేదీలోపు అందజేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు వేసిన పరువు నష్టం దావా విచారణలో భాగంగా ఈ ఉత్తర్వులను న్యాయస్థానం జారీ చేసింది.
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ తప్పుడు ప్రచారం చేశారని కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారని పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యల వల్ల బీజేపీకి పరువు నష్టం కలిగిందని పిటిషన్లో తెలిపారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ల వాంగ్మూలం సేకరించింది. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలను పరిశీలించింది. ఈ కేసులో రేవంత్రెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే.. ఏ క్షణమైనా నోటీసులతో కోర్టు కానిస్టేబుల్ రేవంత్ ఇంటికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగించే కుట్ర చేస్తుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు.. పరువు నష్టం దావా వేశారు. అయితే.. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో.. వెంకటేశ్వర్లు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. హైకోర్టు ఆదేశాలతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నోటీసులు ఇవ్వాలని నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో సీఎం రేవంత్కు సమన్లు జారీ అయ్యాయి.