టీటీడీకి పంజాబ్ కంపెనీ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?

Punjab Company donates 21 crore to TTD Trust: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ)కు భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందించింది. ఏకంగా 21 కోట్ల రూపాయలను ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్. ఈ సంస్థకు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఈ విరాళం తాలూకు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వారిని అభినందించారు. మరోవైపు ప్రాణదాన ట్రస్టు సేవలను గుర్తించే ఈ విరాళం ఇచ్చినట్లు రాజిందర్ గుప్తా తెలిపారు.

మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీవెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కిడ్నీ, గుండె, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారికి ఈ ట్రస్టు అండగా నిలుస్తోంది. ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా ఇలాంటి వారికి ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, ఎస్వీఆర్ఆర్, మెటర్నిటీ ఆసుపత్రులలోఉచితంగా చికిత్స అందిస్తారు. ఈ ట్రస్టు చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి పలువురు విరాళాలు ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే పంజాబ్ సంస్థ కూడా 21 కోట్లు విరాళంగా ఇచ్చింది.

ఆగస్ట్ 16న తిరుమలలో ఛత్రస్థాపనోత్సవం

మరోవైపు తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగస్ట్ 16వ తేదీ ఛత్రస్థాపనోత్సవం జ‌రుగ‌నుంది. ఈ ఉత్సవం సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఏటా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఉత్సవం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఏడుకొండల్లోనే అతి ఎత్తైన నారాయణగిరిపై వెంకటేశ్వరస్వామి మొదటగా కాలు మోపినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి రోజున ఈ ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం సందర్భంగా బంగారు బావి నుంచి నీటిని సేకరిస్తారు. అలాగే శ్రీవారి ఆలయం నుంచి పూజా సామాగ్రిని తీసుకువస్తారు. ఆ తర్వాత రంగనాయకుల మండపం నుంచి మంగళవాయిద్యాలతో మేదరమిట్టకు చేరుకుంటారు. అనంతరం బంగారుబావి నుంచి తీసుకువచ్చిన నీటితో శ్రీనివాసుడి పాదాలకు తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత పాదాల చెంత గొడుగును ప్రతిష్టించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.

About amaravatinews

Check Also

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *