గత ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగివున్న రైలులో వికలాంగుల బోగీలో ఓ మహిళ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య చేసింది సీరియల్ కిల్లర్ గా పోలీసులు గుర్తించారు. ఇతగాడు రైళ్లలో ప్రయాణిస్తూ ఇదే మాదిరి పలు రాష్ట్రాల్లో వరుస హత్యలకు పాల్పడ్డాడు..
ఓ సైకో రైళ్లలో ప్రయాణిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. తెలివిగా ఇతగాడు రైళ్లలోని చివరిభోగీలో ఉండే వికలాంగ కంపార్ట్మెంట్లోకి ఎక్కి ప్రయాణికులపై అత్యాచారం, హత్యలు చేయడానికి అలవాటు పడ్డాడు. ఇలా ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 24 మధ్య 35 రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్లల్లో సంచరిస్తూ ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. గుజరాత్లోని వల్సాద్ పోలీసులు సోమవారం (నవంబర్ 26) పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్రాజ్ సింగ్ వాఘేలాను ఈ సీరియల్ కిల్లర్ వివరాలను మీడియాకు వెల్లడించారు..
అతడి పేరు భోలో కరమ్వీర్ జాట్ అలియాస్ రాహుల్. హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మోక్రా ఖాస్ స్వస్థలం. గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల్లో నేరాలు చేశాడు. ఇటీవల రైల్వేలో సీరియల్ కిల్లర్గా మారాడు. విచారణలో ఇతగాడి నేరాల చిట్టామొత్తం బయటపడింది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్లోని ఓ రైలులోని వికలాంగుల పెట్టెలో మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చా రు. ఈ హత్య తానే చేసినట్లు కరమ్వీర్ అంగీకరించాడు. దీంతో నగర పోలీసులు పీటీ వారెంట్పై కరమ్వీర్ను హైదరాబాద్కి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హర్యానాకు చెందిన కరమ్వీర్కు చిన్నతనంలోనే ఎడమ కాలికి పోలియో సోకింది. ఫలితంగా చిన్నతనం నుంచే ఒంటరిగా ఉంటూ, విచిత్రంగా ప్రవర్తించేవాడు. దీంతో అతడి కుటుంబం కూడా దూరంగా పెట్టింది. ఐదో తరగతితో చదువు మానేసిన కరమ్వీర్.. లారీ క్లీనర్గా పని చేస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. పోలియో ఉండటంతో ఇతడికి ఎవరూ డ్రైవర్గా ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో హైవే దాబాలో పనిచేస్తూ.. అక్కడ పార్క్ చేసి ఉన్న లారీలను ఎత్తుకెళ్లడం ప్రారంభించాడు. అలా నేరాల బాటపట్టిన అతడు చోరీలు, కిడ్నాప్లు చేస్తుండేవాడు. దీంతో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ల్లో అతడిపై 13 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్లోని జోద్పూర్ జైల్లో ఉన్న కరమ్వీర్.. బెయిల్పై విడుదలై బయటకు వచ్చాడు. ఆ తర్వాత రైళ్లల్లో దివ్యాంగుల కోసం చివరలో ఉండే బోగీలపై ఇతడి కన్ను పడింది. రైళ్లలో దివ్యాంగుల బోగీలో ప్రయాణిస్తూ అక్టోబర్ 17న తొలి హత్య చేశాడు.