రాష్ట్ర వ్యప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గడువును జులై 9 వరకు పొడిగించినట్లు జేఎన్టీయూ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ బి. బాలునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. జులై 7న మొత్తం 900 విద్యార్థులకు గాను 806 మంది కౌన్సెలింగ్ హాజరయ్యారు. కాగా ఈసారి మొత్తం 171 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో.. 1.14 లక్షలకుపైగా బీటెక్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లలో కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా 76,795 సీట్లను భర్తీ చేస్తారు. వాటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద దాదాపు మరో 6,500 సీట్లు కలువనున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 10వ రోజు ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. జూలై 13వ తేదీన మాక్ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడిస్తారు. ఇక జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఏపీఈసెట్ 2025 ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్ షురూ.. నేటితో ముగింపు
ఏపీఈసెట్ కౌన్సెలింగ్లో భాగంగా జులై 8, 9 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్ నిర్వహిస్తు్న సంగతి తెలిసిందే. ఈ తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయించుకోవాలని అధికారులు తెలిపారు. ఈసెట్లో వచ్చిన ర్యాంకు ద్వారా గణితం డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులకు నేరుగా బీటెక్లో ప్రవేశాలు కల్పిస్తారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జులై 8న ఆర్మీసంతతి ర్యాంకర్లు 1 నుంచి 20 వేల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితోపాటు ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు 1 నుంచి15 వేల ర్యాంక్ వరకు, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థులు ఒకటి నుంచి ఆఖరి ర్యాంకు వరకు హాజరయ్యారు. ఇక ఈ రోజు (జులై 9న) ఆర్మీ సంతతి 20,001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 15,001 నుంచి చివరి ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు హాజరుకావాల్సి ఉంటుంది. కౌన్స్లింగ్కు ఐచ్ఛికాలను మార్చుకునేందుకు జులై 11న వీలు కల్పించారు. ఇక జులై 13న సీట్ల కేటాయింపు ఉంటుంది.