తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్నటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్- విజయవాడ రూట్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు శుభవార్త తెలిపారు..
ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి ఈ గుడ్న్యూస్ అందించింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ, అదే రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ తెలిపింది.ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ రాయితీతో కల్పించే డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in అధికారిక వెబ్సైట్ని సందర్శించాలని సూచించింది. ఈ విషయాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వెల్లడించారు. విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి టికెట్లపై ఆర్టీసీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు.