మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా..? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే. అపరిచిత వ్యక్తులు తలుపుకొడితే అస్సలు తీయకండి. సర్వే అంటూ ఇంటికొచ్చినా.. లేదా మరో పేరు చెప్పినా అస్సలు డోర్లు ఓపెన్ చేయకండి. ఎందుకంటే వారు దొంగలు కావొచ్చు.. మీ ఇల్లు కొల్లగొట్టొచ్చు. తాజాగా ఖమ్మం జిల్లా పరిధిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది….
ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. సర్వే పేరుతో, ఇంకా ఏ ఇతర అవసరాల కోసమే తలుపు కొడితే ఒక్క క్షణం ఆలోచించండి. తలుపు తీశారో.. మీ ఇల్లు గుళ్లవుతుంది. ప్రతిఘటిస్తే.. మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. వైరా మున్సిపాలిటీ సుందరయ్య నగర్లో శీలం యుగంధర్ రెడ్డి ఇంటి వద్దకు పట్టపగలే కారులో నలుగురు దుండగులు వచ్చారు.. సర్వేకి వచ్చామంటూ తలుపు కొట్టారు. ఆపై నలుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోకి వచ్చారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వెంకట రావమ్మ (65)ను సర్వే పేరుతో వివరాలు అడుగసాగారు. బయట ఎవరూ లేరని నిర్ధారించుకని… ఒక్కసారిగా దాడి చేసి కాళ్లు, చేతులు కట్టేసి..నోటికి ప్లాస్టర్ వేశారు. అనంతరం చోరీకి పాల్పడ్డారు.
ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన 15 లక్షల రూపాయల విలువైన 18 తులాల బంగారు నగలు చోరీ చేసి కారులో పరారయ్యారని బాధితురాలు తెలిపింది. కుమారుడు శీలం యుగంధర్ రెడ్డి ఉద్యోగరీత్యా కొత్తగూడెం వెళ్లాడు. కోడలు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలని టార్గెట్ చేసిన దొంగలు సర్వే పేరుతో ఇంట్లోకి వచ్చి చోరీకి తెగబడ్డారు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన కోడలకు చోరీ సంఘటన తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఏసిపి రహమాన్ సిఐ సాగర్ ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజు పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించిన దుండగులు.. దొంగల కోసం గాలింపు చేపట్టారు.