తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, ఆ సేవ కూడా!

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. అక్టోబర్ 1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల ఆలయంలో మంగళవారం (అక్టోబరు 1) రోజున ఆలయ శుద్ధి నిర్వహిస్తున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా.. అక్టోబర్ 1న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) టీటీడీ రద్దు చేసింది. కాబట్టి సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. భక్తులు దీనిని గమనించి నిర్వాహకులకు సహకరించాలని టీటీడీ కోరింది. అంతేకాదు ఆ రోజు ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

తమిళంలో కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’, ఆళ్వార్ అంటే “భక్తుడు”, తిరు అంటే “ఖగోళం”, మంజనం అంటే “పవిత్ర స్నానం”. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేది భక్తులచే గర్భగుడి, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసే కార్యక్రమం అని చెబుతారు. ప్రతి ఏటా నాలుగుసార్ (ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి) పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో..ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు.

తిరుమల ఆలయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. ఈ ఆలయ శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, పచ్చాకు, గడ్డ కర్పూరం, కస్తూరి పసుపు, కుంకుమ, గంధం పొడి, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం అనంతరం భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

About amaravatinews

Check Also

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ గోష్, లడఖ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *