విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.. ఈనెల 17 నుంచి 20వతేదీ (శని, ఆది, సోమ, మంగళ) వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల కారణంగా అన్ని ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను నిలిపివేశారు. అలాగే దుర్గమ్మ ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చకులు మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు ఆలయ అధికారులు. శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం సాయంత్రం 4 గంటలకు దుర్గమ్మ ఆలయంలో ఉదక శాంతి కార్యక్ర మంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఈ నెల 18వ తేదీ వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించి అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి అలంకారం చేసిన తర్వాత శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య పవిత్రమాలలను ధరింపజేస్తారు. 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, సర్వ ప్రాయశ్చిత విధి, వివిధ దేవతారాధనలు నిర్వహిస్తారని తెలిపారు. ఆలయంలో సాయంత్రం 4 గంటల నుంచి మూల మంత్రహవనాలు, వేద పారాయణలు, హారతి, మంత్రపుష్పం సమర్పిస్తారు.
ఈ నెల 19వ తేదీన మండ పారాధన నిర్వహిస్తారు.. 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మండపా రాధన, శాంతి పౌష్టిక హోమాలు, సర్వప్రాయశ్చిత విధి, కూష్మాండ బలి నిర్వహిస్తారు. అనంతరం 10.30 గంటలకు కలశోద్వాసన, మార్జనం, మహదాశీర్వచనం జరుగుతాయి. ఈ నెల 18వ తేదీన స్నపనాభిషేక కార్యక్రమం సందర్భంగా ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారని ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
మరోవైపు శ్రావణ శుక్రవారం సందర్భంగా.. ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ వరలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. అమ్మవారి శీఘ్రదర్శనం కోసం భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్లను ఈవో రామా రావు, అధికారులు పర్యవేక్షించారు. అలాగే ఆలయంలో శుభముల నొసగుమా శ్రావణలక్ష్మీ.. వరములీయుమా శ్రీవరలక్ష్మీ అని భక్తులు జగన్మాతను వేనోళ్ల కీర్తించారు. శ్రావణ మాస రెండో శుక్రవారం పురస్కరించుకొని వరలక్ష్మీదేవిగా కొలువుదీరిన దుర్గమ్మను వేలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో వీఐపీ దర్శనానికి గంట.. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మరవైపు శ్రావణ మాసం కావడంతో దుర్గమ్మ ఆలయంలో రద్దీ పెరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రద్దీకి తగిన విధంగా.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal