గూగుల్కు చెందిన ప్రముఖ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్.. మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇది కంటెంట్ క్రియేటర్లకు మేలు చేకూరుస్తుందని చెప్పొచ్చు. వీరి ఆదాయం పెంచే దిశగా షాపింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని సాయంతో ఇప్పుడు అర్హులైన కంటెంట్ క్రియేటర్స్ తమ వీడియోల్లో ఉత్పత్తుల్ని ట్యాగ్ చేసి ఆదాయం సంపాదించుకోవచ్చని తెలిపింది. సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో యూట్యూబ్.. ఈ అనుబంధ షాపింగ్ ప్రోగ్రామ్ను గతంలోనే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ సేవల్నే మరికొన్ని దేశాలకు విస్తరించింది. దీంతో .. భారత్లో కూడా ఈ ఫీచర్ను ఇప్పుడు లాంఛ్ చేసింది యూట్యూబ్.
ఈ కొత్త సదుపాయం కోసం యూట్యూబ్.. ఫ్లిప్కార్ట్, మింత్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అర్హులైన కంటెంట్ క్రియేటర్లందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే.. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకునేందుకు.. వీడియో క్రియేటర్లు యూట్యూబ్ షాపింగ్లో సైనప్ కావాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును ప్లాట్ఫామ్ ఆమోదించిన తర్వాత ఈ సదుపాయాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు.
యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసే వీడియోలు సహా షార్ట్స్, లైవ్స్ట్రీమ్లో ఉత్పత్తుల్ని ట్యాగ్ చేయొచ్చు. యూజర్లకు ఆ ప్రొడక్ట్స్ నచ్చినట్లయితే పక్కనే ఉన్న షాపింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తే సదరు ఉత్పత్తుల వివరాలు కనిపిస్తాయి. అయితే ఇందుకోసం వేరే బ్రౌజర్ పేజీకి వెళ్లాల్సిన పని కూడా లేదు. అక్కడే ప్రొడక్ట్ పూర్తి వివరాల్ని తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే.. దానిని అక్కడే పిన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.