వైఎస్ జగన్ టీమ్‌లోకి ఐఐటియన్.. గతంలో లోకేష్ దగ్గర.. ఎవరీ సాయిదత్?

2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ.. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కొన్ని జిల్లాలలో వైసీపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక ఎన్నికల తర్వాత కూడా పలువురు ముఖ్యనేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికీ చాలా మంది పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్మిర్మాణం చేసి.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించడం సహా.. పార్టీ నిర్మాణం కోసం సలహాదారుణ్ని నియమించారు. ఈ మేరకు వైసీపీ వెల్లడించింది.

ఇందులో భాగంగా వైసీపీ నిర్మాణంలో సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్‌ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు.దీంతో ఎవరీ మోహన్ సాయిదత్ అని రాజకీయాలపై ఆసక్తి ఉన్న జనంతో పాటుగా.. వైసీపీ శ్రేణులు కూడా గమనిస్తున్నాయి. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆళ్ల మోహన్ సాయిదత్ విషయానికి వస్తే.. ఈయన చెన్నై ఐఐటీలో చదువుకున్నారు. పొలిటికల్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం సాయిదత్ టీమ్ పనిచేసింది. అలాగే ఢిల్లీలోని బీజేపీ ముఖ్యనేతకు ఫీడ్ బ్యాక్ ఇవ్వటంలోనూ మోహన్ సాయిదత్ టీమ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మంగళగిరిలో నారా లోకేష్ కోసం కూడా సాయిదత్ టీమ్ పనిచేసినట్లు సమాచారం.

మరోవైపు 2019 ఎన్నికల సమయంలో వైసీపీ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీమ్ పనిచేసింది. నాటి ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన వైసీపీ.. అధికార పగ్గాలు చేపట్టింది. అయితే 2024 నాటికి ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ కోసం రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐప్యాక్ బృందం వైఎస్ జగన్, వైసీపీ విజయం కోసం పనిచేసింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పునర్నిర్మాణం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వైఎస్ జగన్.. పొలిటికల్ కన్సల్టెంట్ అయిన ఆళ్ల మోహన్ సాయిదత్‌ను వైసీపీ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి వైఎస్ జగన్ స్ట్రాటజీలు ఏమేరకు ఫలితాన్ని ఇస్తాయనేదీ రానున్న రోజుల్లో చూడాలి మరి.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *