మళ్లీ తెరపైకి ఏపీకి ప్రత్యేక హోదా.. కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఇన్‌ పర్సన్‌‌గా కోర్టులో పిటిషనర్‌ పాల్‌ స్వయంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ హోదా హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని.. ఏపీ ఆర్థికంగా పునరుజ్జీవం పొందేందుకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, సహకారం అవసరం అని కోర్టుకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ గత, ప్రస్తుత ముఖ్యమంత్రులు సైతం ప్రత్యేక హోదా కోరుతున్నారన్నారు.

ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్, జస్టిస్‌ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం. .. హోదా అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర హోం, ఆర్థిక శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్‌ ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ప్రత్యేక హోదా అంశంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని.. ప్రస్తుత పిల్‌ను కూడా వాటితో జత చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టును కోరారు. గతంలో ప్రత్యేక హోదావపై దాఖలైన పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పిల్‌ను కూడా వాటితో కలిపి ఏ బెంచ్‌ విచారణ చేయాలో నిర్ణయించేందుకు ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఏపీలో ప్రధాన సమస్యలపై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పిల్ దాఖలు చేసిన ఆయన.. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంపైనా హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దని.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పైనా విచారణ జరుగుతోంది.. తాజాగా ప్రత్యేక హోదా అంశంపై కూడా విచారణ మొదలైంది.

About amaravatinews

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *