Chardham Yatra: ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ నాలుగు ఆలయాలను 6 నెలల పాటు మూసి వేయనున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చార్ధామ్ యాత్ర చివరి దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. ఆ తర్వాత ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు (ఆదివారం) మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులను మూసివేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను మొదలుపెట్టినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ చెప్పారు. ఆ తర్వాత గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహించి శీతాకాలపు విడిదికి తీసుకువస్తామని తెలిపారు. మరోవైపు.. యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత యమునా దేవి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని దేవాలయానికి తీసుకురానున్నారు. ఇక ఈ ఏడాది చార్ధామ్ యాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరకు 15,21,752 మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను సందర్శించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.