‘అందుకు మీ సలహాలు కావాలి’.. CPM నేతలను రిక్వెస్ట్ చేసిన సీఎం రేవంత్‌

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నామన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీపీఎం నేతలు రాఘవులు, జూలకంటి రంగారెడ్డిలతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వ్యక్తిగత పనుల నిమిత్తం రాఘవులు సెక్రటేరియట్‌కు వెళ్లగా.. అక్కడే ఉన్న సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి వారిని రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రేవంత్ సీపీఎం నేతలకు వివరించారు.

ఇటీవలె రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని.. త్వరలోనే రైతు భరోసా అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా.. తాము మాత్రం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలకు లోటు లేకుండా చేస్తున్నామన్నారు. హామీలన్నింటినీ వెనకో, ముందో అమలు చేస్తామని.. సంక్షేమ పాలనకు మీ సలహాలు, సూచనలు కావాలని సీపీఎం నేతలను కోరారు. మంచి కార్యక్రమాలకు సీపీఎం మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా రాఘవులు సీఎం రేవంత్‌తో అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలుంటే మాత్రం సీపీఎం పార్టీ కూడా లేవనెత్తుతుందని పేర్కొన్నారు. వారి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తదితరులు ఉన్నారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఎంతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదన్న ఉద్దేశ్యంతో రెండు పార్టీల మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే సీట్ల సర్దుబాటు కాకపోవటంతో సీపీఎం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఐకు మాత్రం కాంగ్రెస్ ఒక సీటు కేటాయించింది. కొత్తగూడెం టికెట్ కేటాయించగా.. అక్కడ ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. సీపీఎం మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది. మూడు నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి మద్దతు ఇచ్చింది.

About amaravatinews

Check Also

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 82% బాధితులు మైనర్లే.. బడుగు వర్గాలకు రక్షణేది?

బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం ఎన్నో చట్టాలను మనదేశంలో తీసుకుని వచ్చారు. ఎస్సీ, ఎస్టీల కోసం 1989వ సంవత్సరంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *