Telangana Wines Shops: తెలంగాణలో దసరా అంటే మామూలుగా ఉండదు. చుక్కా ముక్కా ఉండాల్సిందే. అది కూడా ఏదో సరదాగా తాగటం కాదు.. అదో యుద్ధం చేసినట్టే ఉంటుంది. అలాగని తెలంగాణ ప్రజలకు తాగటం ఓ వ్యసనం కాదు.. అలవాటు పడిన ఓ సంప్రదాయం. అయితే.. ప్రతీ దసరాకు.. ఖజానాకు గట్టిగానే కాసులు ముట్టజెప్తారు తెలంగాణ మందుబాబులు. ప్రతిసారిలాగే ఈసారి కూడా.. మందుబాబులు రికార్డుస్థాయిలో మద్యం తాగేశారు. కేవలం పది రోజుల్లో వెయ్యి కోట్లు మార్కు దాటించి.. ఆల్ టైం రికార్డు సృష్టించారు. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా గట్టిగానే మద్యం అమ్మకాలు జరిగినా.. హైదరాబాద్లోనే అధికంగా అమ్మకాలు నమోదైనట్టు తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2260 మద్యం దుకాణాలు ఉండగా.. 1171 బార్లు కూడా ఉన్నాయి. సాధారణంగానే.. మద్యం అమ్మకాలు గట్టిగా ఉండే తెలంగాణలో ఇక బోనాలు, దసరా, సంక్రాతి లాంటి పెద్ద పండుగలు వచ్చాయంటే మద్యం ఏరులై పారాల్సిందే. అదే క్రమంలో ఈ దసరాకు కూడా అదే జరిగింది. దసరాను దృష్టిలో పెట్టుకుని.. ఎక్సైజ్ శాఖ ముందు జాగ్రత్తగా భారీ స్థాయిలో మద్యం నిల్వలను సిద్ధం చేసింది. అనుకున్నట్టుగానే.. ఆర్డర్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. వైన్ షాపులు, బార్లు.. భారీగా నిల్వలను రెడీ చేసి పెట్టుకున్నారు. బతుకమ్మ పండుగ మొదలైనప్పటి నుంచే.. మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఇక.. దసరా శనివారం రాగా.. ఆదివారం కూడా సెలవు దొరకటంతో.. బతుకమ్మతో కలుపుకుని మూడు రోజుల పాటు తెలంగాణ ప్రజలు పండుగను ఎంజాయ్ చేశారు. దీంతో.. మద్యం అమ్మకాలు గట్టిగానే జరిగాయి.
ఈ ఏడాదిలో 2024 సెప్టెంబర్ 30 వరకు 2,838.92 కోట్ల అమ్మకాలు జరగ్గా.. అక్టోబర్ 01 నుంచి 11వ తేదీ వరకే ఏకంగా వెయ్యి కోట్ల మార్కు దాటించారు తెలంగాణ మందుబాబులు. మధ్యలో అక్టోబర్ 02న గాంధీ జయంతి వచ్చినా.. ఆ గ్యాప్ను కూడా పూడ్చారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం.. ఒకటో తారీఖు నుంచి 11వ తేదీ వరకు 1057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగాయి. అయితే.. మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ముందుండగా.. కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. అయితే.. మొత్తంగా చూస్తే గతేడాది కంటే ఈసారి అమ్మకాలు 20 శాతం పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. గతేడాది దసరాకు రూ.877 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు చెప్తున్నారు.
ఇక.. 11, 12, 13 తేదీల్లో అసలైన దసరా పండుగ జరగ్గా.. ఆ మూడు రోజులు అమ్మకాలు అంతకు మించి అన్నట్టుగా మరింత జోరుగా సాగినట్టు తెలుస్తోంది. దీంతో.. ఖజానాకు గట్టినా ఆదాయం చేకూరినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ డిపోల నుంచి రూ 205.42 కోట్ల మేర విలువైన మద్యం రిటైల్ దుకాణాలకు చేరింది. అందులో లిక్కర్, బీర్ల అమ్మకాలు ఒకదానికొకటి పోటీ పడినట్టు సమాచారం.