హైదరాబాద్ మాదాపూర్లో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్పై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదులు రావటంతో ఇవాళ ఉదయం అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్లో మెుత్తం 10 ఎకరాల్లో N కన్వెక్షన్ నిర్మాణం ఉంది. అయతే 29 ఎకరాల్లో ఉన్న తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించినట్లు ఫిర్యాదులు అందాయి. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ కబ్జా చేసి ఈ కన్వెన్షన్ నిర్మించటంతో హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తాజాగా.. హీరో నాగార్జున స్పందించారు. కన్వెన్షన్ కూల్చివేయటం బాధాకరమని ట్వీట్ చేశారు. కూల్చివేతలపై తమకు ఎటువంటి నోటీసులు అందలేదన్నారు. చట్టానికి విరుద్ధంగా తాము ఎటువంటి చర్యలకు పాల్పడలేదని చెప్పారు. కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
‘స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది.
స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేం ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.’ అని నాగార్జున ట్వీట్ చేశారు.