హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు దంచికొడుతున్నాడు. జోరువానతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ప్రధానంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎర్రమంజిల్, కూకట్పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెుహదీపట్నం, చౌలిచౌకి, యూసఫ్గూడ, మసాబ్ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6.40 గంటలకు మెుదలైన వాన గంట నుంచి కురుస్తూనే ఉంది.
దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట స్మశాన వాటిక సమీపంలో రోడ్డుపైకి మోకాళ్ల లోతు నీరు రావటంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పంజాగుట్ట ఫ్లైఓవర్పై దాదాపు కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దగిన జీహెచ్ఎంసీ, పోలీసులు డ్రైనేజీ మ్యాన్హోల్స్ తెరిచి వర్షం నీరు పోయేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.