ఏటా కార్తీకమాసంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగే కోటి దీపోత్సవానికి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉంది. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా భక్తులకు ఆధ్యాత్మిక వైభవం అందించేందుకు కోటి దీపోత్సవ జాతర సిద్ధమైంది. నవంబర్ 9 నుంచి 25 వరకు 17 రోజుల పాటు జరుగనున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. శివ, కేశవుల థీమ్తో భారీ సెట్టింగ్ వేశారు. వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈసారి మరింత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా కోటి దీపోత్సవం ప్రారంభమైంది. నాటి నుంచి ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏటికేడు భక్తుల నుంచి విశేష ఆదరణను పొందుతోంది. ప్రముఖ ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలతో ఈ కార్యక్రమం విరాజిల్లుతోంది. చివరికి దీపాంతపుల కాంతులతో వెలుగులీనుతూ ఆధ్యాత్మిక శోభను పంచుతోంది.
ప్రవచనాల అనంతరం ప్రత్యేక అర్చనలు, నిత్యం దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, నీరాజనాలతో ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. టీటీడీ, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల దేవదేవుల కళ్యాణ మహోత్సవాలను హైదరాబాద్లో ప్రత్యక్షంగా వీక్షించి భక్తులు పులకించిపోతారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కోటి దీపోత్సవంలో మరో అపురూప ఘట్టం.