గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియమాకం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామాకాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ ఎమ్మెల్సీల నియమాకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలన్న పిటిషనర్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే… గవర్నర్‌, ప్రభుత్వ హక్కులను హరించినట్లే అవుతుందని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్రల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి అని ఉద్ఘాటించింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి… గవర్నర్‌ కోటాలో కొత్తగా ఎమ్మెల్సీలను ఎంపిక చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. గవర్నర్ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. అనంతరం విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే, ప్రభుత్వం, గవర్నర్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నా…. సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని పేర్కొంది.

గవర్నర్ కోటా కింద శాసన మండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా.. నాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించలేదు. ఈ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో నాటి కేసీఆర్ సర్కారు నిర్ణయాన్ని తిరస్కరించారు. ఈలోగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం.. బీఆర్ఎస్ సర్కార్ ఓడి.. కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ సర్ాకరు సిఫార్సు చేసింది. దీనికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.

దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని వాదించారు. వీరి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. . ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ క్యాబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని తీర్పు చెప్పిన కోర్టు.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని కొట్టి వేసే అధికారం గవర్నర్‌కు లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసింది.

About amaravatinews

Check Also

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎన్ని పోస్టులున్నాయంటే?

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2025, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఎగ్జామినేషన్‌ 2025.. ఈ రెండు నోటిఫికేషన్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *