తెలంగాణలో గతకొన్ని రోజులుగా స్పెషల్ పోలీసులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు రహదారులు, బెటాలియన్లు, ఎస్పీ కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆందోళనలు చేస్తున్న పోలీసులపై కఠిన వైఖరి అవలంభించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 26) రాత్రి వివిధ బెటాలియన్లకు చెందిన 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
పది మంది టీజీఎస్పీ పోలీసులపై వేటు వేసింది. వారిని డిస్మిస్ చేస్తూ ఆదివారం (అక్టోబర్ 27) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుశాఖలో పని చేస్తూ.. క్రమశిక్షణ ఉల్లంఘించి ఆందోళన నిర్వహించేందుకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది. ఆర్టికల్ 311(2)B ప్రకారం వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇందులో ఓ ఎస్సై స్థాయి అధికారి కూడా ఉన్నారు. డిస్మిస్ అయిన 17వ బెటాలియన్కు చెందిన ఏఆర్ ఎస్సై టి.సాయిరామ్, కానిస్టేబుళ్లు కె.లక్ష్మీనారాయణ, టి.వంశీ, బి.అశోక్, ఆర్.శ్రీనివాస్ ఎస్.కరుణాకర్రెడ్డి, అన్నెపర్తి 12వ బెటాలియన్కు చెందిన హెడ్కానిస్టేబుల్ వి.రామకృష్ణ, ఎస్.కె.షఫీ, ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ జి.రవికుమార్, కొత్తగూడెం 6వ బెటాలియన్కు చెందిన కె.భూషణ్రావు ఉన్నారు.
ఇక సివిల్ పోలీసులతో సమానంగా తమకూ డ్యూటీలు వేయాలని.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా ‘ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలన్న డిమాండ్తో స్పెషల్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళను కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం సైతం పలు జిల్లాల్లో స్పెషల్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. శనివారం 39 మంది కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్లోని 17వ బెటాలియన్, వరంగల్ జిల్లా మామునూరు TGSP 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆదివారం నిరసనలు వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని లేకుంటే అందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.