తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దర్శనం కోసం దళారులను ఆశ్రయించి తమ దర్శన టికెట్లు నష్టపోవద్దని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది.
గురువారం ఉదయం తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారు. వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి ప్రశ్నించగా మొత్తం తమిళనాడులో డొంక కదిలింది. వేలూరు జిల్లా తిరుపత్తూరులో ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహిస్తున్న అన్నాదురై పాస్ పోర్ట్లోని చివరి నెంబర్లు మార్చి ఆన్ లైన్ లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి, అధిక ధరలకు విక్రయించినట్లు వారు తెలిపారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.