తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించడంపై టీటీడీ ఫోకస్ పెట్టింది. కొండపై అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి ఎస్పీసుబ్బరాయుడు.. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.
తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, ఏపీఎస్ ఆర్టీసీ, టీటీడీ ఇంజినీరింగ్, రెవెన్యూ, ట్రాన్స్ పోర్ట్ జీఎంలు కమిటీగా ఏర్పడి వారం రోజుల లోపు సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నారు. తిరుమలలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే గోకులం, ఏటీసీ, రామ్ భగీచా వంటి ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.
వివిధ వర్గాల భక్తులు, ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలకు సూచిక బోర్డులను, నిర్ధిష్టమైన పార్కింగ్ ను ఏర్పాటు చేయాలి అన్నారు అదనపు ఈవో. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులకు టీటీడీ నుండి అదనపు సిబ్బందిని కేటాయించాలన్నారు. తిరుమలలో భవిష్యత్తులో చేపట్టే నిర్మాణాల్లో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి చేయడం.. మల్టీ లెవెల్ పార్కింగ్లను నిర్మించాలన్నారు. నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుని.. అందరూ విధిగా నిబంధనలు పాటించేలా విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్, పార్కింగ్ అప్డేట్స్ వచ్చేలా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.