తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి ఆలయాల్లోని హుండీలలో కానుకలుగా వచ్చిన కెమెరాలను దక్కించుకునే అద్భుత అవకాశం టీటీడీ కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో ఏర్పాటుచేసిన హుండీల ద్వారా భక్తులు ఆ స్వామికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇలా వచ్చిన కెమెరాలను టీటీడీ వేలం వేయనుంది. శ్రీవారికి కానుకలుగా సమర్పించిన ఉపయోగించిన లేదా పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం ఆరు లాట్లను ఆగస్ట్ 28న వేలం వేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆగస్ట్ 28న నిర్వహించే టెండర్ కమ్ వేలంలో పాల్గొనవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org సంప్రదించగలరని ప్రకటనలో తెలిపింది.
రాగి రేకులు వేలం వేయనున్న టీటీడీ
మరోవైపు ఆగస్ట్ 30, 31వ తేదీలలో రాగి రేకులను కూడా టెండర్ కమ్ వేలం వేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లోని హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కాపర్, సిల్వర్ పూత కలిగిన రాగి రేకులను ఆఫ్ లైన్ ద్వారా వేలం వేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కాపర్ -2 (3 వేల కేజీలు) 15 లాట్లను ఆగస్ట్ 30వ తేదీన.. సిల్వర్ పూత పూసిన రాగి రేకులు ( 2,400 కేజీలు) 12 లాట్లను ఆగస్ట్ 31న వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆసక్తి ఉన్న వారు మిగతా వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
Amaravati News Navyandhra First Digital News Portal